అనకాపల్లి వర్ష బాధితులకు అనిత భరోసా
- అకాల వర్షాలతో పాయకరావుపేట నియోజకవర్గంలో తీవ్ర నష్టం
- ఎరకయ్య, శంకర్ అనే వ్యక్తుల మృతి
- ప్రభుత్వం అండగా ఉంటుందని వారి కుటుంబ సభ్యులకు అనిత భరోసా
ఇటీవల కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అనాకపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. కేవలం ఒక అధికారిక పర్యటనలా కాకుండా, బాధితులకు భరోసా ఇచ్చేలా సాగిన ఆమె పర్యటన స్థానికుల్లో కొండంత ధైర్యాన్ని నింపింది.
మంత్రి అనిత మొదటగా సత్యవరం గ్రామాన్ని సందర్శించారు. అక్కడ గ్రామస్థులు ఆమెకు సంప్రదాయబద్ధంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ప్రతి ఇంటికీ స్వయంగా వెళ్లి అర్హులైన లబ్ధిదారులకు ‘ఎన్టీఆర్ భరోసా’ పెన్షన్లను పంపిణీ చేశారు. స్థానిక ప్రజలతో ముచ్చటిస్తూ వారి దైనందిన సమస్యలను, సాధకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత శ్రీరాంపురం గ్రామానికి చేరుకుని, బొద్దపాటి వీరస్వామి కుటుంబాన్ని పరామర్శించి వారి యోగక్షేమాలను ఆరా తీశారు.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా అరట్లకోట గ్రామానికి చెందిన ఎరకయ్య, శంకర్ అనే ఇద్దరు వ్యక్తులు మరణించారు. వారి కుటుంబ సభ్యులను మంత్రి అనిత వ్యక్తిగతంగా కలిసి, ఓదార్చారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వం వారికి పూర్తిగా అండగా ఉంటుందని, తగిన సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు.